- అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటన
- ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
- బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలకు దిశానిర్దేశం
- అన్ని జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా, జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వరంగల్ కేంద్రంగా లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరు పైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించడానికి కార్యచరణను ఖరారు చేశారు.
14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతోపాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పార్టీకి ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతున్న భరోసా ఈ పర్యటనతో కల్పించాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసిఆర్ పైనే ఉందని రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని కేటీఆర్ ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.