రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు వుండరనేది అనేకసార్లు నిరూపితమైంది. సందర్భం వచ్చినప్పుడల్లా క్లారిటీ వస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు ఏ పార్టీ మారతారో చెప్పడం కష్టమే. రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కాకపోతే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి. దాదాపు దశాబ్దం నర తర్వాత ఆమెకు ఓ పదవి నడుచుకుంటూ వచ్చింది. అంతకుముందు టీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మారిన రాజకీయాల నేపథ్యంలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. స్టార్ క్యాంపెయిన్గా చాలా నియోజకవర్గాలు తిరిగారు. బీఆర్ఎస్ను కడిగి పారేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే, రాములమ్మగా పిలుచుకునే విజయశాంతి సేవలను ఎమ్మెల్సీగా కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంలోనే విజయశాంతికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆమెకు చోటు కల్పించబోతున్నట్టు సమాచారం. కేబినెట్లోకి తీసుకున్న తర్వాత ఆమెకి ఏ శాఖను అప్పగిస్తారన్న దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా వాటిని భర్తీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, ఇప్పటివరకు పెండింగ్లో పడుతూ వస్తోంది. కేబినెట్ విస్తరణలో రాములమ్మతో పాటు మిగతా కొందరు నేతలకు కూడా మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి చాలా అడ్వాంటేజ్ అవుతుందని అధిష్టానం లెక్కలు వేస్తోంది.
ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా విజయశాంతి ఎన్నికైనట్టు ప్రకటించగానే గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చేశారు విజయశాంతి. బీజేపీతోపాటు బీఆర్ఎస్పైనా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఏం చేసింది.. గతంలో కేసీఆర్ ఏమి చేశారు? అంటూ మొదలు పెట్టి.. ఏకి పారేశారు. ఈ రెండు పార్టీలకు తాను సేవలు అందించానని, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆ పార్టీల నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్సీ అయినందుకు కొందరు ఎందుకు బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
మరోవైపు.. ప్రస్తుతం రాములమ్మ వ్యవహారశైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్తగా గమనిస్తున్నారట. ఆమె మాట్లాడిన ప్రతీ మాటను వింటున్నారట. గతంలో జరిగిన విషయాలు ఆమె బయట పెట్టడంతో ప్రస్తుతానికి ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడున్న నేతల్లో కొంతమంది మాత్రమే తెలుసు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ నేతలతో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనిపై ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. విజయశాంతికి ఏ విధంగా చెక్ పెట్టాలనే దానిపై కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారని చెబుతున్నారు. ఆమెని కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి యేడాది సీఎం రేవంత్రెడ్డి దూకుడు ప్రదర్శించారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ రాములమ్మ వంతు కానుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. రాములమ్మని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న రీసౌండ్ కారు పార్టీలో అప్పుడే మొదలైపోయిందంటున్నారు.