తమిళనాడుకు చెందిన ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ సభ్యులు విల్సన్ విజయవాడ వచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్తో భేటీ అయ్యారు.
ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా వాళ్లిద్దరూ ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తమిళ నాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్వయంగా రాసిన లేఖను మంత్రి వేలు, ఎంపీ విల్సన్.. వైసీపీ అధినేత జగన్కు అందజేశారు. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని జగన్ను ఆహ్వానించారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. జనాభా ప్రాతి పదికన లోక్సభ నియోజక వర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో, ఈ అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ముఖ్య పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగానే తమిళనాడు మంత్రి, ఎంపీ బుధవారం వైయస్ జగన్ను కలిశారు.