- తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు టీటీడీ అంగీకరించడం లేదని ఫిర్యాదు
- టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి
- చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖలను మీరు చెప్పినా టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. తిరుమల వేంకటేశ్వరిడి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అంగీకరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కొండా సురేఖ ఈ లేఖలో కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మీరు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులకు ఇచ్చిన మార్గదర్శకాలను దేవస్ధానం అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి లేఖలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సిఫార్సు లేఖలు టీటీడీ అధికారులు అంగీకరించకపోవడంతో ఆ సిఫార్సు లేఖలను నమ్మకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సురేఖ ఏపీ సీయం దృష్టికి తీసుకువెళ్లారు. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులు తీసుకు వచ్చిన సిఫార్సు లేఖలు అనుమతించకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంటోందని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఏపీ సీయం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.