బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారని మీడియా చిట్ చాట్లో కేటీఆర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంతోపాటు కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ నామినేషన్ సందర్భంగా ఈరోజు అసెంబ్లీలో కెటిఆర్ మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడారు. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దనేది ఒక కొడుకుగా తన అభిప్రాయమని కెటిఆర్ అన్నారు.
కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరని, సీఎం రేవంత్ రెడ్డి తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేకపోయాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీకి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని ఆరోపించారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నయో ఆయన చుట్టూ ఉన్న నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వందల వేల కోట్ల కుంభకోణానికి నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. శ్రవణ్ ను 2023 లో నామినేట్ చేశాం.. అప్పుడు బీజేపీ ఆపింది. అందుకే కేసిఆర్ మళ్ళీ గుర్తించి అవకాశం ఇచ్చారన్నారు.
ఈ కార్ రేసు కేసులో మళ్ళీ నోటీసులు ఇస్తారని… ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసని పునరుద్ఘాటించారు. ఈ కార్ రేస్ కేసు వల్ల ఏం లాభం జరిగిందో నేను వెల్లడిస్తానన్నారు. 200 కోట్లు పెట్టి ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నారని, దీనివల్ల లాభం ఏంటి.. ఈ మొగోడు ఒలింపిక్స్ పెడుతానంటున్నాడు దానికి లక్ష కోట్లు కావాలని కెటిఆర్ అన్నారు.
అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్షం భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు.. సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు..అనుసరించాల్సిన వ్యూహాలపై అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.