ఆఖరి బాల్ వరకు నరాలు తెగె ఉత్కంఠ.. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. ఎప్పుడు ఎవరి వికెట్ పడుతుందో అర్థం కాదు.. ఇలా సాగింది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. కానీ ఆఖరికి విజయం మాత్రం టీమిండియాదే. దీంతో 25 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీరింది. 12 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. రోహిత్ సేన గర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని పైకెత్తింది.
ఈ విక్టరీతో అసలు సిసలైన ఛాంపియన్స్గా నిలిచింది టీమ్ ఇండియా. 251 పరుగుల టార్గెట్ను టీమిండియా ఈజీగా ఛేజ్ చేస్తుందనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యిందనే చెప్పాలి. 251 పరుగులను ఛేజ్ చేసేందుకు ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, గిల్ మొదట్లో కివీస్ బౌలర్లపై విరుచుకపడ్డారు. రోహిత్ అయితే 41 పరుగులకే హాఫ్ సెంచరీ చేసేశాడు. ఎప్పుడైతే స్పిన్నర్లు బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశారో సీన్ మారిపోయింది. అంతా ఊహించినట్టే.. స్పిన్కు పూర్తిగా దాసోహమంది దుబాయ్ పిచ్.
శాంటర్న్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. గిల్ కొట్టిన షాట్ను అద్భుతంగా క్యాచ్ పట్టి పెవిలియన్కు పంపాడు ఫిలిప్స్. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కోహ్లీ బ్రాస్వెల్ బౌలింగ్లో ఒక రన్కే LBW అయ్యి వెనుదిరగడం ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్.. మ్యాచ్ను చక్కదిద్దేశాడు. అయితే ఇదే సమయంలో రచిన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ స్టంప్ ఔట్ అయ్యాడు. ఇక అక్షర్, అయ్యర్ ఇద్దరు కలిసి ఆచితూచి ఆడుతూ ముందుకు వెళ్లారు. భారీ షాట్కు ప్రయత్నించి అక్షర్ పటేల్.. ఆ తర్వాత అయ్యర్ ఔట్ అవ్వడంతో మళ్లీ టీమిండియాపై ప్రెజర్ పెరిగింది.
ఇక ఈ సమయంలో కేఎల్ రాహుల్ మళ్లీ మ్యాచ్ను తన భుజానికెత్తుకున్నాడనే చెప్పాలి. తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు.. ఇక పాండ్యాకూడా ఒక ఫోర్.. ఒక సిక్స్ బాది ఔటయ్యాడు. తమ అద్భుతమైన ఫిల్డింగ్తో చాలా రన్స్ను సేవ్ చేశారు కివీస్ ప్లేయర్లు. ఆఖర్లో కూడా హార్ధిక్ పాండ్యాను ఔట్ చేసి మరింత ఒత్తిడి పెంచారు న్యూజిలాండ్ ప్లేయర్లు. కానీ చివరికి గెలుపు మాత్రం భారత్నే వరించింది.
ఈ గెలుపుతో మూడో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది టీమ్ ఇండియా. అంతేకాదు వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2024లో టీ20 వరల్డ్ కప్.. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది టీమ్ ఇండియా