తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
దేశంలోనే మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.
ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలైన వరంగల్ ,ఖమ్మం ,కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు.