ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లు రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్ కౌంటింగ్ ఉండగానే పేరాబత్తుల రాజశేఖరం గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. ఏడు రౌండ్ల కౌంటింగ్లో రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12 వేల 331 ఓట్లు సాధించగా.. పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు 41,268 ఓట్లు సాధించారు. దీంతో, వీర రాఘవులుపై పేరాబత్తుల 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన 51 శాతం ఓట్లు రావడంతో రాజశేఖరం విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్లను లెక్కించారు. వీటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా, చెల్లని ఓట్లు 17,578 ఉన్నాయి. ఇంకా దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది.
- Advertisement with us -