సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసు కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటిలో పధ్నాలుగు కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకదాని తర్వాత మరొక కేసు పోసాని మెడకు చుట్టుకుంటుందంటున్నారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన పాలిట శాపంగా పరిణమించాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తో పాటు వారి కుటుంబసభ్యులను దూషించిన కేసులు వరుసగా నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసినా అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరుస పోలీసు కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోసాని కృష్ణమురళిని ఏపీ అంతటా తిప్పుతూ జైళ్లను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పధ్నాలుగు నుంచి పదిహేడు దాకా కేసులు నమోదయ్యాయి. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం పీటీ వారెంట్పై నరసరావుపేటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరొకచోటకు.. ఇలా ఏపీ అంతా ఆయనపై కేసులు నమోదు కావడంతో దాదాపు అన్ని సబ్ జైళ్లను చూపించే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరొక కేసు రెడీగా ఉండటంతో ఆయన నాలుగు గోడల మధ్య నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు కూడా అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30 పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్గా మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకి వెళ్లారు. గుంటూరుజిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పోసానిని అప్పగిస్తే తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారట.మూడు జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో.. ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు.. పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.