- ఆప్ పార్టీలో అనూహ్య పరిణామాలు?
- పంజాబ్ ఉప ఎన్నిల బరిలో ఎంపీ అరోరా
- లూథియానా వెస్ట్ నుంచి పోటీకి రెడీ
- గెలిస్తే మంత్రిపదవి ఇస్తామని ఆఫర్
- జాతీయ రాజకీయాలపై అరవింద్ దృష్టి..
- పార్టీని బలోపేతం చేయాలన్నదే లక్ష్యం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఓటమి నుంచి కోలుకుని జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే త్వరలో పార్లమెంటులో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆప్ పార్టీ లో జరుగుతున్న మార్పులు చూస్తే అదే ఖాయమనిపిస్తోంది.
పంజాబ్ లోని లూథియానా వెస్ట్ నియోజక వర్గానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది. ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి ప్రమాద వశాత్తు తుపాకీ పేలి మరణిండంతో ఆ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఇదే నేపధ్యంగా ఆప్ కొన్ని మార్పులు చేస్తోంది. ఖాళీ అయిన లూథియానా వెస్ట్ లో ఆప్ ఎంపీ, వాణిజ్య వేత్త అరోరాను పోటీకి దింపి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి అరవింద్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
అరోరా 2022లో పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2028తో ముగియనుంది.అయితే ఆయన ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యేగా ఉండేందుకు సిద్ధపడితేనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. పరిణామాలన్నీ ఆదిశగానే కదులుతున్నాయి. అరవింద్ పార్లమెంటు కు వెళ్లే అంశాన్నిఅడిగితే పార్టీ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి. కానీ ఆదిశగా చర్చలు జరుగుతున్నాయని అంగీకరించాయి. తనను లూథియానా వెస్ట్ బరిలో నిలిచేందుకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఙతలంటూ అరోరా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తో అరవింద్ పార్లమెంటు ఎంట్రీ అనుమానాలు బలపడుతున్నాయి. అరోరా తన ఆన్ లైన్ పోస్టులో ఎవరి పేరు పెట్టకుండా పార్టీకి థాంక్స్ చెబుతూ ఇకపై తన సొంత ఊరి ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కుతుందని అన్నారు. అరారో గెలిస్తే పంజాబ్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇస్తామని పార్టీ వర్గాలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. తమ పార్టీ నేతకు కానుకగా ఇచ్చిన సీటుకు ఇది ఆయనకు లభించే మేలు.
దశాబ్దం పాటు ఢిల్లీని పాలించాక ఓటమిని చవిచూసిన కేజ్రీవాల్కు ఇప్పుడు ఉప ఎన్నికలో పార్టీ సత్తాను చాటడం మరో పరీక్ష అనే చెప్పాలి. తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశాక మరో ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంటికి కేజ్రీవాల్ మారిపోయారు.కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగు పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నిర్ణయమే అని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి అతిషిని ఆప్ శాసన సభా పక్షం నేతగా నియమించారు కాబట్టి ఇక జాతీయ రాజకీయాలపైనే కేజ్రీవాల్ గురి. ఇవాళో రేపో దీనిని పార్టీ వర్గాలు థృవీకరించే అవకాశముంది.