ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై నిపుణులు, నిష్ణాతులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టన్నెల్ దగ్గర సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఎంతటి ఉన్నతస్థాయి పరిజ్ఞానమైనా ఉపయోగించి సొరంగంలో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకు రావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా న్యూఢిల్లీతో పాటు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో టన్నెల్ వర్క్స్లో నిష్ణాతులైన వాళ్లను ప్రత్యేకంగా పిలిపించారు.
ఇవాళ ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ , టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అధికారులు కల్నల్ బ్లాక్ స్మిత్ మెహ్రా, లెఫ్టినెంట్ కల్నల్ హార్పల్, ఎన్డీఆర్ఎఫ్ డి ఐ జి మోహ్సెన్ షహది, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, నేవీ అధికారి వికె ప్రసాద్, రాబిన్ సన్ టన్నెల్ అధికారి గ్లెన్, ర్యాట్ మైనర్స్ బృందం ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలను మంత్రులు సమీక్షించారు.
టన్నెల్లోని డిబిఎం వరకు చేరుకునేందుకు వీలున్న అన్ని మార్గాలను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆయా విభాగాల అధిపతులు, అధికారులు మంత్రులకు వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న బురద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.