- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
- అయిదు స్థానాలు కూటమి ఖాతా లోకే
- మరిప్పుడైనా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారా?
- మంత్రిపదవన్నారు.. లేదు..
- టీటీడీ ఛైర్మన్ అన్నారు.. అదీ లేదు
- సాయిరెడ్డి ఎంపీ సీటు దాదాపు బీజేపికే
- మరిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఈసారైనా అన్నకు తమ్ముడు న్యాయం చేయగలడా?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. టీడీపీ, జనసేన మధ్య మళ్లీ నాగబాబుకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ ఇవ్వాలన్న పంచాయతీ తెర మీదకొచ్చింది. అసలు మొన్నటి ఎన్నికల్లోనే నాగబాబుకు అనకాపల్లి ఎంపీ సీటుకేటాయిస్తారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు ఆ స్థానాన్ని బీజేపీకి వదులుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు, మంత్రి పదవుల కేటాయింపు అంశం తెరమీదకొచ్చింది. ఇంకేముంది నాగబాబుకు మంత్రిపదవి గ్యారంటీ అని జనసేన కార్యకర్తలంతా డిసైడ్ అయిపోయారు.సోషల్ మీడియాలో నాగబాబును ఆకాశానికెత్తేస్తూ పార్టీకోసం కష్టపడే వారిని పదవులు వరిస్తాయని కలలు కన్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తన సోదరుడికి మంత్రిపదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే పవన్ కు డిప్యూటీ సీఎం పదవినిచ్చిన చంద్రబాబు మంత్రివర్గంలో మూడు పార్టీలకు చెందిన సీనియర్లు,సామాజిక వర్గాల ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పంపకాలు జరగాలి కాబట్టి ఈసారికి నాగబాబును అకామిడేట్ చేయలేమని సర్ది చెప్పారు. అది జనసేన కార్యకర్తల కడుపు మండించింది. పవన్ సొంత సోదరుడికే న్యాయం జరగకపోతే ఇక కూటమిలో ఉండి ప్రయోజనం ఏమిటంటూ చెలరేగిపోయారు. అసలే టీడీపీ తమని తొక్కేస్తోందని భావిస్తున్న జనసేన కార్యకర్తలు ఆ పరిణామాలపై ఆవేశంతో ఊగిపోయారు. మళ్లీ నాగబాబుకు పదవి అంశం పక్కకెళ్లిపోయింది. రెండు పార్టీల మధ్య పెరుగుతున్న గ్యాప్ పై ఇరు పార్టీల సీనియర్లకు అంచనాలున్నాయి. అయితే పవన్ సర్దుకుపోయే వైఖరితో సేన కార్యకర్తలను శాంతింప చేశారు. కష్టపడే వారికి పదవులు పెద్ద కష్టం కాదని, నాగబాబుకు తన సోదరుడైనంత మాత్రాన పదవి ఇచ్చేయబోరని,పద్ధతిగానే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అన్నారు. ముందు నాగబాబును ఎంపీని చేద్దామనే ప్రతిపాదన కూడా చంద్రబాబు ప్రస్తావనకు తెచ్చారు. ఇదే సమయంలో ఎంపీ విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ఎంపీ పదవి ఇంకా నాలుగేళ్లు ఉండగానే నిష్క్రమించారు. దాంతో మరోసారి నాగబాబును ఎంపీని చేసే అంశం తెరపైకి వచ్చింది.ఎలాగూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఆ సీటు ను నాగబాబుకు కేటాయించడం పెద్ద కష్టం కాకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే ఆ సీటు పైనా క్లారిటీ రాలేదు.పవన్ చంద్రబాబుని అడిగితే బీజేపి పెద్దలను అడగమని సూచించినట్లు, ఈ పనిమీదే పవన్ మొన్నామధ్య ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. అయితే ఏ విషయమైనా చంద్రబాబుతోనే మాట్లాడుకోమని బీజేపి పెద్దలు కూడా స్పష్టం చేయడంతో పవన్ గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చారు.ఎంపీ సీటుపైనా బీజేపి, టీడీపీ గేమ్ ఆడుతున్నాయా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అది బీజేపి తమకే కావాలని పట్టుబడుతోందని తెలుస్తోంది.పైగా ఆఎన్నికకు ఇంకా చాలా టైముంది. దాంతో నాగబాబుకు పదవి కట్టబెట్టే వ్యవహారం మరోసారి మూలన పడింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తూ నాగబాబును ముందు ఎమ్మెల్సీని చేస్తామని ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకుంటామనీ అన్నారు. కార్యకర్తలు అనవసరంగా రచ్చ చేయద్దని ఒకింత సీరియస్ గానే చెప్పారు. ఆ ఘడియ ఎప్పుడొస్తుందా అని జనసేన కార్యకర్తలు ఉగ్గబట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా ఘడియ రానే వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయిదు ఖాళీలూ కూటమి కౌంట్ లోకే పోతాయని అందరికీ తెలిసిన విషయమే.. మరిప్పుడైనా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారా? అయితే దీనిపై టీడీపీలోనే భయంకరమైన పోటీ నెలకొంది. విశాఖ కోటాలో దాడి వీరభద్రరావు, గిడ్డి ఈశ్వరి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ తనకు కాకపోతే తన కొడుకుకైనా దక్కాలని దాడి ఉబలాట పడుతున్నారు. ఇలా ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు.ఇక మొన్నా మధ్య ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయితే పవన్ తమ కోటాలో దానిని తన పార్టీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ కు కేటాయించారు. అప్పుడూ నాగబాబుకు ఏమీ ఇవ్వడం లేదన్న కోపం జనసైనికుల్లో రేగింది.పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత గుర్తింపు, గౌరవం ఇస్తామని పవన్ అప్పట్లో స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు,టీటీడీ ఛైర్మన్ పదవి ఇలా కీలక పదవుల పంపిణీ జరిగినప్పుడల్లా నాగబాబు పేరు ఒకసారి చర్చల్లోకి వస్తోంది. ఆ సమయంలోనే బీజేపి నుంచి కూడా కేంద్రంలోకి రావాలంటూ తనకు ఆహ్వానం ఉందని అవసరమైతే తాను కేంద్ర మంత్రిపదవికి షిఫ్ట్ అయి నాగబాబుకు ఛాన్స్ ఇప్పిస్తాననీ పవన్ సర్దిచెప్పారు. పవన్ కు నిజంగానే బీజేపి నుంచి అలాంటి సంకేతాలు ఉండి ఉండొచ్చు. లేదా చంద్రబాబుకుఝలక్ ఇవ్వడానికైనా అలా చెప్పి ఉండొచ్చు.
లోకేష్ పవన్ మధ్య? :
మరోవైపు ఎమ్మెల్సీ పదవుల పంపిణీలోనూ లోకేష్ దే ఫైనల్ డెసిషన్ అని ఆనోటా ఆనోటా వినిపిస్తోంది. పవన్, లోకేష్ మధ్య గ్యాప్ ఏమీ లేకున్నా.. లోకేష్కి సీఎం పదవి అని టీడీపీ ప్రచారం చేసినప్పుడల్లా జనసేన కార్యకర్తలు రగిలిపోతున్నారు. చివరకు సాయిరెడ్డి ఖాళీ చేసిన సీటుపై ఇప్పటి దాకా బయటకు ఎలాంటి ప్రకటనా రాలేదు కాబట్టి మరోసారి ఎంపీ పదవి ఇస్తామంటూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనూ దాటేస్తారా? అసలు నాగబాబుకు పదవి ఎంతెంత దూరం?