ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయిన తర్వాత వైసీపీ సభ్యులు పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినదించారు. ఆ తర్వాత కాసేపటికే జగన్తో పాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
సభ ప్రారంభం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. తమ తమ సీట్లలో ఆసీనులయ్యారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే వైసీపీ సభ్యులు నిరసన ప్రారంభించారు. పోడియం దగ్గరికి వెళ్లి వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. “అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే” అంటూ నిరసనకు దిగారు. దాదాపు 11 నిమిషాల పాటు వైసీపీ సభ్యులు తమ నిరసన తెలిపారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమ పార్టీ సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ సీట్ల దగ్గరే నిల్చొని మద్దతు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత జగన్ సహా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.