రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే తెలునని, తెలంగాణ ప్రజల కోసం పోరాడేది గులాబీ నేతలే అని అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన సమావేశంలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీలోని కొందరి నేతలు ప్రచారం చేశారని కెసిఆర్ సీరియస్ అయ్యారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారన్నారు. ఇలా ప్రచారం చేయడం సరైనది కాదని కెసిఆర్ పార్టీ నేతలకు హితబోధ చేశారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన ప్రతినిధుల సమావేశం ఉంటుందని, ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వ నమోదుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును ఇంచార్జ్ ప్రకటించారు. పార్టీ కమిటీలతోపాటు త్వరలోనే మహిళ కమిటీల ఏర్పాటు చేస్తామని కెసిఆర్ సమావేశంలో వెల్లడించారు.
సంవత్సరం పొడవున పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహించాలని అధినేత కేసీఆర్ ముఖ్య నేతలకు సూచించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్ట పడాలని కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత అధినేత పార్టీ కార్యాలయానికి రావడంతో ముఖ్యనేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ చేరుకున్నారు.