రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల గణనీయంగా తగ్గడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భజల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు… కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ పయనిస్తోందని ఎక్స్ వేదికగా హరీశ్ రావు పేర్కొన్నారు.
హరీశ్ రావు కామెంట్స్…
కేసీఆర్ నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భజలాలు 56% పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా 27,000కు పైగా చెరువులను పునరుద్ధరించడంతో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అంది, 8.93 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
రైతులకు సాగు సౌకర్యం మెరుగుపడి, భూగర్భజలాల నిల్వ స్థిరంగా ఉండి, తాగునీటి భద్రత బలపడింది. కానీ, కేవలం 14 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గడం ఆందోళనకరం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రెండు మీటర్లకు పైగా భూగర్భజలాలు పడిపోయాయి. యాదాద్రి భువనగిరిలో 2.71 మీటర్ల భారీ తగ్గుదల నమోదు కాగా, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఇతర జిల్లాల్లోనూ భూగర్భజలాల అడుగంటుతున్నాయి.
120 కిలోమీటర్ల పొడవున గోదావరి పూర్తిగా నీరు లేకుండా ఎండిపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను నిలబెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.
తెలంగాణ ప్రజలకు తాగునీటిని అందించిన మిషన్ భగీరథ ఇప్పుడు పూర్తిగా కుంటుపడింది. ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాగునీటి కోసం ఎక్కువ మోటార్లు నడిపించుకోవాల్సి రావడం వల్ల కరెంట్ బిల్లులు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది.
కాంగ్రెస్ పాలన తెలంగాణను నీటి సంక్షోభం వైపు నెట్టింది. బలమైన నీటిపారుదల వ్యవస్థను కాంగ్రెస్ తన నిర్లక్ష్యంతో పతనం చేస్తున్నది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో రాష్ట్రం మరింత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.