దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు.
తమిళ సూపర్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి డీఎంకే పార్టీ కమల్ ను పెద్దల సభకు నామినేట్ చేస్తుందని సమాచారం. జూలైలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ప్రచారం తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు. తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ ఇంటికి వెళ్లారు. కమల్ ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. మీకు రాజ్యసభ సీటు కన్ ఫర్మ్ చేసినట్లు చెప్పారట.
కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయం పార్టీ గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. పొత్తులో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2025 ఏడాదికి ఒక రాజ్యసభ సీటు ఇస్తామని అప్పట్లో వాగ్దానం ఇచ్చారట. ఈ డీల్ లో భాగంగా, లోక్ సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు, మిత్ర ధర్మం పాటిస్తూ.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారట.
కాగా, దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు. జూన్ లో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రామిస్ ను కమల్ హాసన్ కు చేరవేశారు మంత్రి శేఖర్ బాబు. మిమ్మల్ని పెద్దల సభకు పంపిస్తామని కమల్ హాసన్ తో ఆయన చెప్పినట్లు సమాచారం.