- రేపే పార్లమెంటులో కొత్త బిల్లు
- వచ్చే ఏడాది ఏప్రిల్1 నుంచి కొత్త చట్టం అమల్లోకి
- కొత్త దానిపేరు ఇన్ కంటాక్స్ బిల్లు 2025
- ప్రస్తుతం అమలవుతున్నది ఐటీ యాక్ట్ 1961
- సులభమైన పదాలు, తేలికైన భాషతో కొత్త బిల్లు
- గందరగోళపరిచే పదబంధాల తొలగింపు
- కొత్త బిల్లులో టాక్సు పరిమితుల్లో పెద్దగా మార్పులేం లేవు.
- స్వల్ప కాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నుకాలపరిమితి, వడ్డీ రేట్లలో నో ఛేంజ్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు గురువారం పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్1 నుంచి అమల్లోకి రానున్న ఇన్ కం టాక్సు బిల్లు 2025 లో మొత్తం 600 పేజీలు, 23 చాప్టర్లు, 16సెక్షన్లు, 536 క్లాజులతో రూపొందింది. ఆర్థిక మంత్రి గతంలో చెప్పిన విధంగానే పాత బిల్లు ఎక్కువ పదాలతో గందరగోళం సృష్టించేదిగా ఉందని ఈ కొత్త బిల్లులో చాలా పదాలు తొలగించి సులభతరం చేశారు. అసెస్ మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అన్నమూడు పదాలు తొలగించి దాని బదులు సింపుల్ గా టాక్స్ ఇయర్ అని మార్చారు. ఈ టాక్స్ ఇయర్ అంటే 12 నెలల ఆర్థిక కాలం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
పెద్దగా మార్పులేమీ లేవు…
కొత్త బిల్లులో క్యాపిటల్ గెయిన్స్ (STCG) అంటే స్వల్పకాలిక మూల ధన లాభాల పన్ను కాల పరిమితిలో, రేట్లలో ఎలాంటి మార్పు లేదు. STCG కాలపరిమితి ఏడాది. దానికి రేటు20 శాతం. ప్రసుత్తం అమల్లో ఉన్న ఐటీ యాక్ట్ 1961 నాటిది. అందులో 298 సెక్షన్లున్నాయి. కొత్త బిల్లులో దానిని 536 క్లాజులకు పెంచారు. ఈ కొత్త బిల్లు సులభమైన పదాలతో చాలా తేలికగా అర్ధమయ్యేలా రూపొందించారు. ఇది మనదేశంలో ఆరో ఆదాయపన్ను బిల్లు. కొత్త బిల్లుకు పార్లమెంటు ఆమోదం జరిగాక పాత చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. బిల్లు ఆమోదం పొందాక ఇన్ కంటాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వస్తుంది.
సోదాలు, దాడులు, ఆస్తుల స్వాధీనం అధికారాలు…
పార్లమెంటులో ఈ కొత్త బిల్లు పెట్టాక దానిని స్టాండింగ్ కమిటీకి పంపుతారు. దానిపై చర్చ జరిగి ఏమైనా సూచనలు చేస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే కొత్త చట్టంలో ఐటీ అధికారుల సర్వే, రైడ్స్, ఆస్థుల స్వాధీనం అధికారాలను యధాతధంగా ఉంచారు. కొత్త బిల్లులోని సెక్షన్ 149 ఐటీ అధికారులకు ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నా, సెర్చ్ ఆపరేషన్స్ చేసేలా, తమ అనుమానాలకు తగిన ఆధారాలు చూపాల్సిన అవసరం లేకుండా దాడులు చేసేలా ఐటీ అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు.
ఎర్న్ డ్ లీవ్ సదుపాయం
కొత్త బిల్లులో ఎర్న్ డ్ లీవ్ కాలాన్ని నగదుగా ఉద్యోగి మార్చుకుంటే అది రిటైర్మెంట్ సమయంలో ఏడాదికి 30రోజుల చొప్పున మొత్తం సర్వీస్ ను పరిగణనలోకి తీసుకుని లెక్కించి సొమ్ము అందచేస్తారు. రిటైర్ అయిన లేదా స్వచ్ఛంద పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు ఉద్యోగుల సర్వీస్ కాలం, వారి ఆరోగ్యపరిస్థితి, అప్పుడున్న వడ్డీరేట్ల ఆధారంగా లెక్కిస్తారు. దీనికి అమల్లో ఉన్న మోర్టాలిటీ ప్రమాణాలనే ఆధారంగా తీసుకుంటారు.
కొత్త బిల్లు ఎందుకంటే…
ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ యాక్ట్ 1961 నాటిది. కాలానుగుణంలో అందులోనే మార్పులు, సవరణలు చేసుకుంటూ అది చాలా సంక్లిష్టంగా మారిపోయింది. టాక్స్ పేయర్లు దానిని రిఫర్ చేయాలన్నా తమ పన్నువివరాలు సరిచూసుకోవాలన్నా చాటభారమంత క్లాజులు, సవరణలు రిఫర్ చేయాల్సి వస్తోంది. కొత్త బిల్లుతో ఐటీ వివరాలు చూసుకోవడం, లెక్కేసుకోవడం చాలా సులభమవుతుంది. అందులో ఉన్న అనేకానేక సందేహాలను, లీగల్ వివాదాలను ఈ కొత్త బిల్లు తగ్గిస్తుంది. వ్యాపార వేత్తలు, ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్లు ఇకపై సులభంగా ఐటీ లెక్కలు వేసుకోవచ్చు. నమ్మకమే ప్రాతిపదికగా కొత్త విధానం పనిచేస్తుంది. స్క్రూటినీ తర్వాత జరుగుతుంది.
భారతీయ న్యాయ సంహిత మూల సూత్రాల ప్రాతిపదికగా అదే సిద్ధాంతంతో కొత్త ఐటీ బిల్లు 2025 రూపొందుతుందని ఆర్థిక మంత్రి నిర్మల మొన్న బడ్జెట్ సమావేశాల్లోనే స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 చట్టం 2024 జులై నుంచే అమలును రద్దు చేశారు. కొత్త ఐటీ చట్టం యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోందని, సంక్లిష్ట పద బంధాల స్థానంలో సులభమైన భాషను మార్చబోతున్నామని నిర్మల తెలిపారు.