శివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోనూ చాలా వరకు ఆలయాలున్నాయి. ఈ క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశo నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాది శివరాత్రి నిర్వహణా అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రధానoగా క్యూ మేనేజ్ మెంట్, మంచి నీటి వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్ల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల నుండి మంత్రి సురేఖ వివరాలు సేకరించారు. మహాశివరాత్రి నేపథ్యoలో శైవ క్షేత్రాలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, వరంగల్ డిసి సంధ్యారాణి, ఆర్జేసీ రామకృష్ణ, హైదరాబాద్ డీసీ కృష్ణ ప్రసాద్, జిల్లా అసిస్టెంట్ కమిషర్లు, అన్ని ప్రముఖ శివాలయాల ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.