- డార్క్ హ్యూమర్ పేరుతో చెత్తవాగుడు
- రణ్ వీర్ అలహాబాదియాపై కేసు నమోదు
- ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నఅందరిపైనా
- పార్లమెంటుకు చేరిన వ్యవహారం
- ముంబై, ఒడిషాలలో కేసుల వెల్లువ
- సారీ చెప్పిన రణ్ వీర్ అల్ఘా బాదియా
- సీరియస్ గా పరిగణించిన శివసేన ఎంపీ
డార్క్ హ్యూమర్ పేరుతో సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్లు వేస్తున్న వెకిలి వేషాలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం సంస్కారం లేకుండా వావి వరసలు లేకుండా జోకులు, హాస్యం పేరుతో వారు చేస్తున్న కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా, అసభ్యకరంగా ఉంటున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం. అయినా ఇన్ ఫ్లుయెన్షర్ల తీరు మారటం లేదు. ఈసారి రణ్వీర్ అల్హాబాదియా అనే ఇన్ ఫ్లుయెన్షర్ అదే రకపు చవకబారు జోకులేసినందుకు అస్సాం పోలీసులు అతగాడిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రోస్ట్ షోలో డార్క్ హ్యూమర్ పేరుతో వేసిన ఓ జోకు ఇప్పుడు అతగాడు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు కారణమవుతోంది. 31 ఏళ్ల రణ్ వీర్ ఓ పోడ్ కాస్టర్, యూ ట్యూబర్ కూడా. పేరొందిన ఇన్ ఫ్లుయెన్సర్… రణ్ వీర్ ఆ వెంటనే సారీ చెప్పినా ఈ వివాదం ముదిరి పార్లమెంటు దాకా వెళ్లి ఇప్పుడు అతడి పీకకు చుట్టుకుంటోంది.
షోలో పాల్గొన్న టీమ్ అందరిపైనా కేసులు
ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో జడ్జిలుగా వ్యవహరించిన ఆశీష్ చంచలానీ, హాస్య చతురత పండించే జస్ ప్రీత్ సింగ్, మఖీజా, రైనా, ఇంకా ఇతరులపైనా అసభ్యతను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఎఫ్ ఐఆర్ నమోదైంది.
వివాదాస్పదమైన కామెంట్..
ఈ టీమ్ లో ఉన్న రణవీర్ ఓ కంటెస్టెంట్ పై తల్లి దండ్రుల సెక్స్ కార్యకలాపాలను రోజూ చూస్తూ ఊరుకోడమేనా? నీవుకూడా పేరెంట్స్ తో సెక్స్ లో పాల్గొని వారి దుకాణం బంద్ చేసేదేమైనా ఉందా అంటూ అత్యంత అసభ్యకరంగా కామెంట్ చేశాడు. ఇది వివాదంగా మారింది. వస్తున్నవ్యతిరేకతను చూసి ఆవెంటనే రణ్ వీర్ సారీ చెప్పాడు. జోకు వేయాలన్న ఆతృతతో అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పాడు. జరిగిన ఘటనను సమర్ధించుకునే ఉద్దేశం నాకు లేదు. నా ప్లాట్ ఫామ్ ఈరకమైన రచ్చకు దారి తీస్తుందని ఊహించలేదు. జడ్జిమెంట్ లో విచక్షణ కోల్పోయాను. అలా అని ఉండాల్సింది కాదంటూ రణ్ వీర్ వివరణ ఇచ్చాడు.
వెల్లువెత్తిన వ్యతిరేకత..
ఇది వైరల్ గా మారి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అనేకమంది ఎంపీల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అల్హా బాదియాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసే అంశం పరిశీలిస్తున్నారు. రణ్ వీర్ కు కోట్లాది మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆ షోలో పలువురు ఎంపీలు కూడా గతంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ రణ్ వీర్ కు అవార్డు కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి సామాజిక బాధ్యత లేకుండా ఇంత అసభ్యకరంగా ఇలాంటి జోకులేయడం దిగజారుతున్న నైతిక విలువలకు నిదర్శనం. దీనిపై తప్పనిసరిగా ఎథిక్స్ కమిటీ ముందు అతనిని హాజరు పరచాల్సిందేనన్నారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. సమాచార, ఐటి మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలైన తాను దీనిని ఉపేక్షించేది లేదని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
ఫిర్యాదుల వెల్లువ
ఈ షోలో పాల్గొన్న టీమ్ అందరిపైనా అటు ముంబైలోనూ, ఇటు అస్సాం లోనూ కూడా కేసులు నమోదయ్యాయి.ముంబైలో రణ్ వీర్ పై కుప్పలుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రణ్ వీర్ కు 4.5 మిలియన్ల ఇన్స్టా గ్రామ్ సబ్ స్క్రైబర్లు,1.05 కోట్ల మంది సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. రణ్ వీర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అభ్యంతరం తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్చ ఉంది కదాని ఇలా లిమిట్స్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దెబ్బకు ఇదే షోలో పాల్గొనేందుకు అనుమతులిచ్చిన వారంతా వెనక్కు తగ్గారు. తాము రాబోవడం లేదని స్టాండప్ కామెడియన్లు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలని సింగర్ బి. ప్రాక్ అన్నారు.
తీరు మారని ఇన్ ఫ్లుయెన్షర్లు..
సోషల్ మీడియాలో పోడ్ కాస్టర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లను కోట్లాది మంది ఫాలో అవుతూ ఉంటారు.. వారు చేసే ప్రతీ కామెంట్, ప్రతీ వాక్యం, ప్రతీ షో ఎంతో జాగ్రత్తగా చేయాలి. కానీ డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ పేరుతో ఈ దారుణమైన కల్చర్ పెడధోరణలు పడుతోంది.గతంలో ఓ ఐఏఎస్ కుమారుడైన హనుమంతు అనే ఇన్ ఫ్లుయెన్సర్ ఇలాంటి అసభ్యకరమైన చెత్త వాగుడే చేశాడు. తండ్రీ,కూతుర్ల అనుబంధానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోలో ముక్కుపచ్చలారని ఆ పాపకి, తండ్రికి మధ్య అసహజ బంధం కల్పించి సభ్య సమాజం నివ్వెరపోయేలా అత్యంత జుగుప్పాకరమైన కామెంట్లు చేయడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. హన్మంతుపై కేసు బుక్ చేయడం నిందితుడిని కటకటాల పాల్జేయడం జరిగాయి. అలాగే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కూడా ఇలాంటి ఘాటైన, మోటైన జోకులు వేయడంలో సిద్ధహస్తుడు. ఆయన హైదరాబాద్ షోను బీజేపి నేతలు అడ్డుకోవడంతో ఆయన ఈవెంట్ కాన్సిల్ చేసుకోవడం గుర్తుండే ఉంటుంది.
ఇదేం హాస్యం?
కోట్లాది మంది చూసే ప్రజాదరణ కలిగిన షోస్ లో హాస్యం పేరుతో, డార్క్ హ్యూమర్ పేరుతో ఇలా అసభ్యకరంగా కామెంట్లు చేస్తే ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సరందరూ ఆలోచించుకోవాలి. డిగ్రేడెడ్, చవక బారు హాస్యం.. వారిలో విశృంఖల, అనైతిక ఆలోచనలకు నిదర్శనం కాదా? వీరినుంచి సభ్యసమాజం ఏం నేర్చుకోవాలి? సైబర్ చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లనే ఇలాంటి దుష్ట సంస్కృతి పెచ్చరిల్లుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.