-
ఢిల్లీని గెలుచుకున్న ఆరెస్సెస్ మ్యాజిక్
-
ఢిల్లీని క్లస్టర్లుగా, జోన్లుగా విభజన
-
ప్రజల మైండ్ సెట్ ను ప్రభావితం చేసిన ఆరెస్సెస్
-
4 లక్షల మందితో నేరుగా వారం వారం చర్చలు
-
50 వేల మీటింగులు, విశ్లేషణలు
-
దేశభక్తిని ప్రేరేపించే ఆలోచనలు
-
సమస్యలపై అవగాహన పెంచిన కార్యకర్తలు
ఢిల్లీ ఎన్నికల్లో విజయం వెనుక రెండేళ్ల ఆర్ఎస్ఎస్ సైలెంట్ గ్రౌండ్ వర్క్ ఉంది. బీజేపి విజయాల వెనక పైకి కనపడని ఆరెస్సెస్ హస్తం పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్జ జరుగుతోంది. ఆరెస్సెస్ స్కెచ్ వేసిందంటే ఇక దానికి తిరుగుండదు. రాజకీయం ఏ మలుపు తిరిగినా బేస్ లెవెల్లో ఓటింగ్ సరళిని మార్చేందుకు అది వేసినస్ట్రాటజీ బ్రహ్మాండం.. ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయడంలో సింహభాగం పాత్ర ఆరెస్సెస్దే.. అగ్ర నేతలు ఎవరి ప్రచారంలో వారుండగా ఆరెస్సెస్ మాత్రం సైలెంట్గా క్షేత్రస్థాయిలో ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ప్రజల మైండ్ సెట్ను మార్చేసింది. ప్రజల ఆలోచనా సరళిని ప్రభావితం చేయగలిగింది.
ఆరెస్సెస్ కనుసన్నల్లో కమలం :
2014 ఎన్నికలలో గెలుపు తర్వాత బీజేపీ ఎన్నికల వ్యూహాలన్నీ ఆరెస్సెస్ చేతిలోకి వెళ్లినట్లే.. ఆరెస్సెస్ ప్రచార శైలి వినూత్నంగా ఉంటుంది. లక్ష్యాన్ని అనుకుందంటే దానిని సాధించి తీరాల్సిందే. ఈమధ్య హర్యానా ఎన్నికల్లో 90కి 40 సీట్లు గెలుచుకున్నా, మహారాష్ట్రలో మహాయుతి కూటమి 288 కి 237 సీట్లు గెలిచినా అంతా ఆరెస్సెస్ కష్టమే. రాజకీయంగా బిజెపి వ్యూహాలకు తోడు గ్రౌండ్ లెవెల్లో మాస్ ఒపీనియన్ ప్రభావితం చేసే సరికొత్త మెకానిజంతో ఆరెస్సెస్ వ్యూహం అమలు చేసింది. ఢిల్లీని క్లస్టర్ జోన్లుగా విభజించడం దగ్గరనుంచి మైక్రోలెవెల్లో గల్లీ మీటింగుల వరకూ అన్నీ పక్కాగా, పకడ్బందీగా అమలు చేసింది.
50వేల డ్రాయింగ్రూమ్ మీటింగులు :
ఢిల్లీని గెలిచేందుకు ఆరెస్సెస్ రెండేళ్ల నుంచి సైలెంట్ గా వర్క్ చేస్తోంది. ఏడాది క్రితమే ఢిల్లీలో మోహరించిన ఆరెస్సెస్ దళాలు మొత్తం ఢిల్లీని 8 విభాగాలుగా విడదీశాయి. శిఖర స్థాయిలో అగ్రనేతలు చెమటోడుస్తుంటే.. క్షేత్ర స్థాయిలోకి బలంగా చొచ్చుకుపోయింది. ఇంటింటి తలుపునూ తట్టింది. ప్రజల్లో మమేకమైపోయింది. మురికి వాడలు కేజ్రీవాల్ వెంటే ఉన్నా.. మధ్య తరగతి మైండ్సెట్ను ఆరెస్సెస్ అల్లుకుపోయింది. 8 విభాగాలుగా విడదీసిన ఢిల్లీలో 30 జిల్లాలనూ కలుపుకుపోయేలా 173 నగర్స్ (అంటే చిన్న చిన్న నగర యూనిట్లు) కింద విభజించింది. ఢిల్లీ ప్రజలతో జోన్ల వారీగా మమేకమై తిరిగింది. ఎన్నికల ప్రచారంలో 50 వేల డ్రాయింగ్ రూమ్ మీటింగుల పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రతీ చిన్న యూనిట్ను కొందరు ఆరెస్సెస్ వాలంటీర్లకు అప్పగించింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ సెంటర్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలు ఇలా అన్నింటిలోకి ఆరెస్సెస్ ప్రభావం చొరబడింది.
అనుబంధ సంస్థల కీలక రోల్ :
ఆరెస్సెస్ ఒకటే కాదు.. తన రెక్కల కింద ఉన్న ఇతర అనుబంధ సంస్థలనూ మోహరించింది. భారతీయ మజ్దూర్ సంఘ్,సేవాభారతి, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారతీయ శిక్షక్ మహాసంఘ, హిందూ జాగరణ్ మంచ్ ఇలా అన్ని యూనిట్లు ప్రచారంలో దూసుకుపోయాయి. తమ టాస్క్ ను రీచ్ అయ్యాయి. ప్రతీ చిన్న యూనిట్ లోనూ రెండు వేల డ్రాయింగ్ రూమ్ మీటింగులను ఆరెస్సెస్ సంఘ్లు ఏర్పాటు చేస్తే 4,550 మీటింగులను ఆరెస్సెస్ అనుబంధ విభాగాలు నిర్వహించాయి.
పాంచ్ పరివర్తన్ నినాదం :
దాదాపు నాలుగు లక్షల మంది 50 వేల మీటింగులకు అటెండ్ అయ్యారు. బీజెపీని గెలిపిస్తే తాము పాంచ్ పరివర్తన్ అంటే అయిదు సరికొత్త మార్పులు తీసుకొస్తామని.. అందరూ బీజేపికి ఓటు వేయాలని పదేపదే చెప్పారు. ఒక విధంగా వారి మైండ్ సెట్ను ప్రభావితం చేసారు. కీలకమైన పర్యావరణ కాలుష్యం, అవినీతి, సామాజిక సమతుల్యత, కుటుంబ విలువలు, స్వదేశీ అన్న అంశాలపై ప్రజలను చైతన్యపరచడమే కాదు.. వారితో చర్చించారు. పదేపదే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరాన్ని ప్రస్తావించారు.
చివరి 27 రోజులు కీలకం :
రెండేళ్ల ముందు నుంచే గ్రౌండ్ వర్క్కు తోడు చివరి 27 రోజల పాటు ప్రచార శైలితో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఒక రకంగా ప్రజల మైండ్సెట్ను తమకు అనుకూలంగా మలచుకోగలిగింది. ఓటర్లను చైతన్య పరచడమే కాక దేశ ప్రయోజనాలను కోరుకునే వారంతా తప్పనిసరిగా కమలానికే ఓటువేయాలంటూ ఒక రకంగా హిప్నటైజ్ చేసింది. అసలు ఎన్నికల తేదీలు ప్రకటించకుండానే ఆరెస్సెస్ మూల మూలలకి, సందు సందులకి, ఇంటింటికీ విస్తరించి ప్రిలిమినరీ రౌండ్ ప్రచారం పూర్తి చేసేసింది. వీధి కూడళ్లు, కమ్యూనిటీ సెంటర్లు, వాడలు అన్నింటిలోకి చొరబడ గలిగింది. నలుగురు కూడే ప్రతీచోటా ఓ మీటింగ్ ఏర్పాటు చేయడమే టార్గెట్. వారం వారం ఆ మీటింగ్లను కొనసాగించడం అలా పకడ్బందీగా ఓటర్లను అల్లుకుపోయింది. దేశం బాగుకోసం ఓటు వేయడం ఎంత కీలకమో చెబుతూనే బీజేపికే ఎందుకు ఓటు వేయాలో చెప్పడంలో ప్రజల విశ్వాసాన్నిచూరగొంది. ఈ టాస్క్ని ఎంత నీట్గా పూర్తి చేశారంటే వారసలు ఆరెస్సెస్ కార్యకర్తలే అన్నవిషయం ఎవరికీ తెలియనంతగా.. దీనికి తోడు అగ్రనేతల ప్రచారం, వ్యూహాలు కలిసొచ్చాయి. ఫలితం ఆప్ 12 ఏళ్ల పునాదులను పెకలించి ఢిల్లీ గద్దెపై కాషాయ జెండా ఎగిరింది. 27 యేళ్ల కమలం కల నెరవేరింది.