- అధిష్టానం వద్దకు చేరిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ
- అధిష్టానంతో చర్చలు జరపనున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క
- మొదటగా పిసిసి కొత్త కార్యవర్గం
- ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ
- రెండు భారీ బహిరంగ సభల ఏర్పాటుకు పిసిసి కసరత్తు
- ఒక సభకు రాహుల్ గాంధీ మరో సభకు ప్రియాంక వచ్చే అవకాశం
వందల సంఖ్యలో పదవులు… నామినేటెడ్ పోస్టులు… క్యాబినెట్ విస్తరణ… ఈ అంశాలన్నీ ఇప్పుడు ఢిల్లీకి చేరాయి… చాలా రోజుల నుంచి ఈ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణలకు సంబంధించి అనేక మంది శాసనసభ్యులు, పార్టీ నాయకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ లు అధిష్టానంతో చర్చలు జరపడానికి ఢిల్లీ చేరుకున్నారు. అధిష్టానంతో భేటీ అనంతరం మొదటగా పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త కార్యవర్గం లేకపోవడం వల్ల కింది స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించడంలో సమస్యలు వస్తున్నాయని నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర కార్యవర్గాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హామీ ఇచ్చి వెళ్లారు.
దీనికి సంబంధించిన జాబితాను రెడీ చేసుకుని సీయం, డిప్యూటీ సీయం నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో గ్రీన్ స్లిగ్నల్ లభించిన వెంటనే పిసిసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాబినెట్ విస్తరణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిపి ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 12, మరో ఆరుగురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. కీలకమైన శాఖలకు మంత్రులు లేకపోవడం వల్ల సమస్యలు రావడం ముఖ్యమంత్రి వద్దనే అన్ని కీలక శాఖలు ఉండడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయనే అంశాన్ని చాలా సందర్భాల్లో నేతలు అధిష్టానానికి వివరించారు. వివిధ కారణాల చేత క్యాబినెట్ విస్తరణకు ఇప్పటివరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది దాటిన నేపథ్యంలో ఈసారి ఢిల్లీ టూర్ లో క్యాబినెట్ కు సంబంధించి క్లారిటీ వస్తుందని నేతలు అంటున్నారు. అందరి అభిప్రాయాలు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఈ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పదవులు ఆశిస్తున్న నేతలు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. క్యాబినెట్లో స్థానం కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. పార్టీ పరంగా పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా పెండింగ్లో ఉంది. వందకు పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా నేతలు చెప్తున్నారు. అధిష్టానం అనుమతితో పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
ఇక రాజకీయంగా రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు పిసిసి ఉంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ సమావేశాలకు ఇప్పటికే ఆహ్వానించారు. రాహుల్ గాంధీ టైం ఇచ్చిన వెంటనే ఈ నెలలోనే భారీ బహిరంగ సభను నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేతలు ఉన్నారు. మార్చ్ లో కూడా ఒక బహిరంగ సభ ఉంటుందని దానికి ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గేలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.