కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని రాజ్నాధ్సింగ్కి లోకేష్ వివరించారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ కు తెలిపారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఎపికి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఎపిని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎపి అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.
- Advertisement with us -