భవన నిర్మాణ అనుమతులపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఒక్క సీఆర్డీఏ మినహా రాష్ట్రంలోని అన్ని చోట్లా భవన నిర్మాణ అనుమతుల జారీ అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 300 చదరపుమీటర్లు లోపు నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ను ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, టౌన్ప్లానర్లు సైతం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే, కేవలం నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ నిబంధనలను సులభతరం చేసింది.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతులను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా భవన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ సీఎస్ సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.
- Advertisement with us -