రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీలైనంత తొందరలో పలు అంశాలపై చర్యలు చేపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొందించిన 2025 మీడియా డైరీని మంగళవారం నాడు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సమగ్ర సమాచారంతో టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ రూపొంచిన డైరీ జర్నలిస్టులకే కాకుండా, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా సమాచారం నిక్షిప్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు జర్నలిస్టు సంఘాల నేతలను అభినందించారు.
ఈ సందర్భంగా ఉప్పల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని యూనియన్ నేతలు మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 15ఏళ్ళ క్రితం ఉప్పల్, ఘట్ కేసర్ జర్నలిస్టులకు కాట సింగారం గ్రామ శివారులో ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఆ ఇళ్ల స్థలాల భూమిని వెంటనే స్వాధీనం చేసేందుకు చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు మంత్రిని కోరారు.