ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకీ తీవ్రం అవుతోంది. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా తీవ్రమైన వాయు కాలుష్యాన్ని రాజధాని నగరం చవిచూస్తోంది. శుక్రవారానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 409కి చేరుకుంది. నగరమంతా పొంగమంచు కప్పుకుని ఉండటంతో వాహదారులు రహదారులు కనపడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉన్న 39 పొల్యూషన్ మానటరింగ్ సెంటర్లలో 21 సెంటర్లు తీవ్రమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తున్నాయి. వజీర్పూర్, రోహిణీ, జహంగీర్ పురి, బవానా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 పై చిలుకు సూచిస్తుండటంత ఆ ప్రాంతాలను అత్యంత తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వర్గీకరించింది. ఢిల్లీలో కాలుష్య స్ధాయి మూడో దశలో ఉందని బోర్డు ప్రకటించింది. ఐదొవ తరగతి లోపు విద్యార్థులకు పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఇంటి వద్దే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిది. ఎలక్ట్రిక్, సీఎన్జీ, బీఎస్-6 వాహనాలను మాత్రమే ఢిల్లీ నగరంలోకి అనుమతించి మిగిలిన వాహనాలకు నగరంలో నిషేధం విధించారు.