శనివారం మహబూబ్ నగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మహబూబ్ నగర్ లో 30 న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే రైతు పండగ సభా ఏర్పాట్లను టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, అడిషినల్ డీజీ మహేష్ భగవత్, సమాచార శాఖ కమీషనర్ హరీష్, మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర తదితర సీనియర్ అధికారులతో ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా, సి.ఎస్ మాట్లాడుతూ, 30 న సాయంత్రం 4 గంటలకు సభా వేదికకు ముఖ్య మంత్రిచేరుకుంటారని, మధ్యాహ్నం రెండున్నర వరకే రైతులు సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నేడు, 28 న ప్రారంభమైన రైతు పండగ వేదికలో దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభావేదిక వద్దకు చేరుకునే నాలుగు మార్గాల వద్దనే ఉన్న సమీపంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సభకు హాజరయ్యే రైతులకు తగు సీటింగ్, మంచినీటి సౌకర్యం,మెడికల్ క్యాంపులు, టాయిలెట్ తదితర సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు. ఈ సభకు కనీసం 25 వేలకు పైగా మహిళారైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగుఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు. రేపు, 29 తేదీ సాయంత్రం లోగా సభా వేదిక, జాతర ఏర్పాట్లన్నీ పూర్తి కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా, మండలం నుండి వచ్చే బస్సుల్లో ఒక కానిస్టేబుల్, ఒక ప్రత్యేక లయజన్ అధికారిని నియమించాలని తెలిపారు.