రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు. పట్నం నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించండని చెప్పారన్నారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్… అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ కామెంట్స్
కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారని, కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారని ఆరోపించారు.
కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తి పై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు. కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా? సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. నువ్వు నియంత కాదు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్.
శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు.
సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.