దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, ఇప్పుడు నటుడిగా కూడా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ నుంచి మొదలు పెడితే ‘హనుమాన్’ వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రల ద్వారా తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా రవి కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్ ఈ ‘మిస్టర్ మాణిక్యం’ చిత్రాన్ని నిర్మించారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
‘మిస్టర్ మాణిక్యం’ సినిమాలో సముద్రఖని భార్యగా అనన్య నటించారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అ ఆ’లో నితిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసినది ఈ అమ్మాయే. తెలుగులోనూ విజయం సాధించిన ‘జర్నీ’లో ఓ హీరోయిన్. ఇతర ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు భారతి రాజా, నటుడు నాజర్ నటించగా… కీలక పాత్రల్లో తంబి రామయ్య, ఇళవరసు, తరుణ్, కరుణాకరన్, చిన్ని జయంత్, వడివుక్కరసి నటించారు.
ఈ చిత్రానికి కూర్పు: ఎస్పీ రాజా సేతుపతి, కళ: సాగు, స్టంట్స్: దినేష్, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: జీపీ రవి రేఖా కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్, దర్శకత్వం: నంద పెరియసామి.