ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ విజయభారతి సాయని తో భేటీ అయిన లగచర్ల ఫార్మా భాదితులు తమ గోడు వెళ్లబొసుకున్నారు. అక్రమ అరెస్టులను, భౌతిక దాడులను పోలీసులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల దౌర్జన్యాలను మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ కు వివరించారు. చట్టపరంగా దోషులను శిక్షించాలని వేడుకున్నారు.
భాదితుల వెంట బీ.ఆర్.ఎస్ ఎంపీలు కె ఆర్ సురేష్ రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర, డి .దామోదర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, హరిప్రియ నాయక్, బీ.ఆర్.ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పలువురు కొడంగల్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు.
ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ను కలిసిన లగచర్ల బాధిత రైతులు అనంతరం మీడియాతో మాట్లాడారు. భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా ధర్నాలు చేస్తున్నాం. ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారు.
ఆ దాడిని సాకుగా చూపి అర్థరాత్రి రాత్రి 500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి మాపై దౌర్జన్యం చేశారు. మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారు. మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారు. భూములు ఇవ్వమని చెబుతున్నాము. ఉన్న మొత్తం భూమిని తీసుకుంటే మేము ఎలా బతకాలి. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోంది.
ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారు. ఎనిమిది రోజులుగా మా పిల్లలు ఎక్కడున్నారో తెలియదు వారిని కూడా తీసుకెళ్తామని చెబుతున్నారు. 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వం. సి.ఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే మమ్మల్ని బెదిరించి పంపించారు.