ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నుంచి సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. ఇటీవల తనను కలిసిన సాయిదుర్గ తేజ్ కు సవర తెగ గిరిజనులు చేసిన పెయింటింగ్ ను పవన్ కల్యాణ్ అందించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయిదుర్గ తేజ్ షేర్ చేశారు.
మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనదని సాయిదుర్గ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన సవరలు సహజ రంగులతో పెయింటింగ్స్ గీస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సవర తెగల వారి కళ అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా సవర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసి ప్రోత్సహించాలి. పవన్ కల్యాణ్ ఎవరికైనా బహుమతిగా కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సవర తెగల పెయింటింగ్స్ ఇస్తారు. మనమూ ఆ కృషిని, స్ఫూర్తిని కొనసాగించాలి. లేపాక్షి షోరూం సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఈ కళాకృతులు కొనుగోలు చేసుకోవచ్చని సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు.