కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్లు బరులు గీసి పుంజులను రెడీ చేశారు. కానీ తీరా పందెం మొదలయ్యే టైమ్కు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ కత్తి కట్టి బరిలోకి దిగేందుకు సిద్ధమైన పుంజుల సంగతేంటి? ఇదే ప్రశ్న ఎదురైంది పోలీసులకు. ఈ చిక్కంతా తమకెందుకు లే.. కోర్టు చూసుకుంటుంది అంటూ ఆ పందెం కోడిని కోర్టుకు చేర్చారు. ఇప్పుడేం చేయాలా? అని కాసేపు ఆలోచించిన జడ్జికి ఓ మెరుపు ఐడియా వచ్చింది. అదే వేలంపాట. దీంతో కాయ్ రాజా కాయ్ కాస్త పాడు రాజా పాడు అన్నట్టుగా మారిపోయింది.
జనవరి 12.. అంటే సంక్రాంతి రోజున హైదరాబాద్లోని అజీజ్నగర్లో కోడిపందాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతోపోలీసులు రెయిడ్ చేశారు. ఈ సందర్భంగా ఓ కోడిని కూడా తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులోనే మనం పైన చెప్పుకున్నదంతా జరిగింది.
మరి వేలంపాట ఏమైందనే కదా.. ? జడ్జి సమక్షంలో ఈ కోడిని వేలం వేయగా.. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఈ కోడి కోసం అధిక ధర పలికారు. రూ.2,500లకు పందెం కోడిని దక్కించుకున్నారు రామకృష్ణ.
కోడిని దక్కించుకున్నందుకు ఆయన ఆనందం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఏకంగా దానికి సన్మానం చేశారు రామకృష్ణ. తనకు మూగజీవాలంటే ఇష్టమని.. కోడిని ఎవరైనా దక్కించుకుంటే చంపి తినేస్తారేమో అని భయంతోనే దక్కించుకున్నానని చెప్పారు. తన ఫామ్ హౌజ్లో పెంచుకుంటానన్నారు. దీంతో ఇకపై కత్తి కట్టి బరిలోకి దిగాల్సిన పని.. లేదంటే కోసుకొని ఎవరి ప్లేట్లోకి వెళ్లాల్సిన బాధ తప్పింది ఆ పందెం కోడికి. మరి వయోలెన్స్కు అలవాటు పడిన ఆ పందెం కోడ ఆ ఫామ్హౌజ్లో శాంతంగా ఉండగలుగుతుందా? అనేది చూడాలి.