సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను ఓలలాడిస్తున్న లక్నవరం సరస్సులో మరో కలికితురాయి చేరింది. పర్యాటకులకు స్వర్గధామం.. లక్నవరంలో ఇప్పటికే రెండు ద్వీపాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మూడో ద్వీపం అందుబాటులోకి వచ్చింది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో రూ. 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని (ఐలాండ్ ను) పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.