బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అప్పులు తప్ప నీళ్లు రాలేదని ఎమ్మెల్సీ కోదండరాం ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమీషన్ కి ఇప్పటికే ఒక అఫిడవిట్ దాఖలు చేశానని ఆ అఫిడవిట్కు అనుబంధంగా మరొక లేఖను రాశానని చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లోనే అనేక లోపాలు ఉన్నాయన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం కంటే ముందే గోదావరి జలాలపై చాలా అధ్యయనం చేశామన్న కోదండరాం.. ప్రాణహిత చేవెళ్లను అనేక మంది ఇంజనీర్లు ఆలోచించి డిజైన్ చేసారని చెప్పారు. తెలంగాణకు తక్కువ ఖర్చుతో నీళ్లను ఇవ్వడానికి రూపొందించింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీర్లు వ్యతిరేకించారని.. అయినా అప్పటి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును మొదలుపెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక నిబంధనలు తుంగలో తొక్కారని కాగ్ కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తామే ప్రాజెక్టు కట్టించామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని.. మరి.. కట్టించినవి పని చేయాలి కదా అని కోదండరాం ప్రశ్నించారు.