సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడం అవివేకమని కేంద్రమంత్రి విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి.. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని, కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభిస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పని, అయితే గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. ఆయన తన ప్రజలతో మాట్లాడాలని హితవు పలికారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని కేంద్రమంత్రి వెల్లడించారు.