– ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తుమ్మల
రేపు, ఎల్లుండి జరగనున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించారు. రెండురోజుల ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. మహిళా రైతులు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం ఉదయం వ్యవసాయ కార్యదర్శి, ఏపీసీ రఘునందన్ రావు, కమిషనర్ గోపిలతో కలిసి మంత్రి రాజేంద్రనగర్ లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియంను పరిశీలించారు. ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు అక్కడ చేస్తునన ఏర్పాట్లను మంత్రికి వివారించారు. కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. రైతులకి ఉపయోగపడేలా, ఆవరణలో అనువైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణు దేవ్ వర్మ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, పర్యటన, ప్రసంగ కార్యక్రమాల్లో సమయపాలన పాటించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.