సినీ నటుడు మంచు మోహన్బాబుపై నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు కీలక ప్రకటన చేశారు. మోహన్బాబు అరెస్ట్ వ్యవహారంలో ఆలస్యమేమీ లేదన్నారు. మోహన్బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని, హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే, ఇప్పటికే ఇచ్చిన నోటీసులకు ఈనెల 24వ తేదీ వరకు సమయం కావాలని సమాధానం ఇచ్చారన్నారు. మోహన్బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ వివాదంలో మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మోహన్బాబు మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉందన్నారు. అయినా ఈనెల 24వ తేదీలోపే విచారించడం కోసం న్యాయస్థానానికి విన్నేవిస్తామన్నారు. మోహన్బాబుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్లైసెన్స్ లేదన్నారు. అయితే, ఆయన దగ్గర రెండు గన్స్ ఉన్నాయన్నారు. డబుల్ బ్యారెల్ గన్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉన్నాయన్నారు.
మరోవైపు.. మోహన్బాబు తన లైసెన్స్డ్ గన్ను పోలీసులకు సరెండర్ చేశారు. తన పీఆర్ఓ ద్వారా ఏపీలోని చంద్రగిరి పోలీసులకు డబుల్ బ్యారెల్ గన్ అప్పగించారు. ఇటీవల జరిగిన ఘర్షణలు, వివాదాల నేపథ్యంలో మోహన్బాబుపై కేసులు నమోదు కావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయన దగ్గరున్న లైసెన్స్డ్ గన్స్ పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
మరోవైపు.. మంచు మోహన్బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్బాబు మైకు లాక్కొని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ సంఘటనపైనే కేసు నమోదైంది.