బీసీల సమస్యల కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ఆంశంలో ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. విజయవాడలో ఏపీ అగ్ని, వన్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం నూతన కార్యాలయ భవనం ప్రారంభ కార్యక్రమంలో మల్లాడి పాల్లొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, అగ్ని, వన్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బర్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకార సామాజికవర్గంలోని 14 ఉప కులాలకు చెందిన సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. మత్స్యకారుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలను కలసి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన ( మంగళవారం) ముగ్గురిని కలసి వివరించనున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణా రావు, ఎమ్మెల్యేలు కొండబాబు, బొమ్మిడి నాయకర్ లతో పాటు మరి కొందరి పెద్దలతో కలసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిను, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలను కలవనున్నామని వెల్లడించారు.