బీఆర్ఎస్ కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారంగా అరాచక శక్తులతో, అమాయక దళిత గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక కాల్ డేటా తీస్తే.. బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు బయటకు వచ్చిందన్నారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన సంఘటనలో ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులతో చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం ఇవన్నీ అవకాశాలు ఉండగా కుట్రపూరితంగా బిఆర్ఎస్ నాయకులు అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమని మల్లు భట్టి విక్రమార్క ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావొద్దని, ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరుగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరించడం మంచిది కాదని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ కొరకు భూసేకరణ చేసిన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షం పార్టీగా రైతుల పక్షాన గొంతెత్తతామని, అధికారులను కలిశామని, న్యాయస్థానానికి వెళ్ళామే తప్ప ఏనాడూ ఇలా దాడులకు తెగబడలేదని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇలా దాడులు చేయించడం కరెక్టేనా? అని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడాలని సూచించారు. ఇలా దాడులు చేయించడంపై సమాజానికి ఏం సందేశం ఇస్తారని నిలదీశారు. ప్రజా ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరితంగా దుర్మార్గమైన దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు అధైర్య పడవద్దని భట్టి విక్రమార్క అభయం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కుట్రపూరితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అత్యంత వెనుకబడి ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా పారిశ్రామికీకరణ అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర అభివృద్ధి కోసం డీటెయిల్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తోందన్నారు. లగచర్లలో దళిత గిరిజనులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా అమాయకులైన పేద బడుగు బలహీన వర్గాల యువతను రెచ్చగొట్టి ప్రాణాలు బలిగొన్నారని విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళీ అదే విధంగా అమాయక దళిత గిరిజనులను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావులు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికే.. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలతో ఒప్పందం కుదిరిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని చెబుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పడం అంటే బిజెపికి ఓటు వేయమని చెప్పడమే అన్నారు. రాష్ట్ర గవర్నర్ పై తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని, ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్ట ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.