యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాకిస్థాన్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దీంతో పాక్ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం యూఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లుగా యూఏఈలోని పాకిస్థాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ అంగీకరించారు. తమకు యూఏఈ వీసాలు రావడం లేదని పాకిస్థాన్లోని సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో యూఏఈలోని పాకిస్థాన్ ఎంబసీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాక్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ మాట్లాడుతూ పాకిస్థానీలకు వీసాల జారీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వీసాలు తీసుకువారికి రిటర్న్ టికెట్లతో పాటు హోటల్ బుకింగ్స్, 3వేల దిర్హామ్లు ఉండాలి. వాస్తవానికి పాక్ పౌరులు యూఏఈకి వెళ్తూ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, నకిలీ పత్రాలతో ప్రయాణించడంతో పాటు యూఏఈలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఆయా అంశాల ఆధారంగా పాకిస్థాన్ పౌరులపై నిషేధం విధించాలని యూఏఈ కేబినెట్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని పాక్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్కి అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇందులో పాకిస్థానీ జాతీయులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం.. దేశంలో నిరసనలు చేయడం స్థానిక చట్టాలను ఉల్లంఘించడమేనని యూఏఈ అధికార వర్గాలు తేల్చి చెప్పాయి.