దూళిపాళ్ళ నరేంద్ర… సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు. ఆరు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభకు ఎన్నికైన నేత. అటువంటి నేతకు ప్రస్తుతం టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వంలోనే నరేంద్రకు మంత్రి పదవి దక్కుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేశాయి. కానీ విచిత్రంగా రాజకీయాల్లోనే కాకుండా శాసనసభ్యుడిగా కూడా తన కన్నా జూనియర్ అయిన పత్తిపాటి పుల్లారావును తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆ పర్యాయం చేసిన మంత్రివర్గ విస్తరణలో కూడా నరేంద్రపేరు పరిగణలోకి తీసుకోలేదు చంద్రబాబు.
ఇక 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆరోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన నరేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో కనీసం చీఫ్ విఫ్ గా అయినా తమ నాయకుడికి అవకాశం దక్కుతుందేమో అని పొన్నూరు దేశం తమ్ముళ్ళు వెయ్యికళ్ళతో ఎదురు చూశారు. చీఫ్ విప్ పదవిని గుంటూరు జిల్లాకే ఇచ్చినా నరేంద్రకి కాకుండా వినుకొండ శాసనసభ్యుడు జీవీ.ఆంజనేయులుకు ఇవ్వడం నరేంద్ర అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకంగా 16 మంది శాసనసభ్యులకు విప్ పదవులు ఇచ్చారు చంద్రబాబు. చివరికి తమ నాయకుడిని ఆ 16 మందిలో కూడా స్ధానం దక్కకపోవడం పట్ల టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పొన్నూరు నుంచి ఆరు పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కు ప్రభుత్వ పదవులు అందని ద్రాక్షగా మిగిలిపోవడం విచారకరం. గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లను క్యాబినేట్ లోకి తీసుకోవడంతో నరేంద్రకు స్ధానం కల్పించలేకపోయారు చంద్రబాబు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో కూడా గుంటూరు పార్లమెంట్ స్ధానం నుంచి ఎన్నికైన కమ్మసామాజికవర్గానికే చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎంపిక చేశారు. ఇలా ఏదో ఒక సమీకరణల కారణంగా నరేంద్రకు ఎప్పుడూ అన్యాయం జరుగుతూ వస్తోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నరేంద్ర సైతం తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నా బయట పడలేకపోతున్నారు. పార్టీ పట్ల తిరుగులేని విశ్వాసం, నిబద్ధత కలిగి ఉండడమే కాకుండా పార్టీకి కష్టకాలంలో ట్రబుల్ షూటర్ గా, పార్టీ వాణిని బలంగా వినిపించే గొంతుకల్లో ఒకటిగా, తెలుగుదేశం రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు ఏ కారణంగానో మొదటి నుంచి అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.