- రాహుల్ గాంధీలో భట్టి భేటీ
- కులగణన, ప్రజాపాలన విజయోత్సవాల గురించి రాహుల్ కి వివరించిన భట్టి
- రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, మంత్రివర్గ విస్తరణలపై ఇరువురి మధ్య చర్చ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తి చేసినట్లు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. బుధవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన భట్టి తెలంగాణలో ఇటీవల వారం రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల గురించి తెలియచేశారు. రాష్ట్ర ప్రజలు యావన్మంది ఈ వేడుకల్లో ఎలా భాగస్వామ్యమయ్యింది రాహుల్ కి చెప్పారు భట్టి. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన కులగణన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజాపాలన విజయోత్సవాలు, మంత్రివర్గ విస్తరణ వంటి పలు అంశాలు చర్చకు వచ్చినట్ల సమాచారం. ప్రజాభాగస్వామ్యంతో కులగణన పూర్తి చేయగలిగామని దాని ఆధారంగా దళిత, గరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు పథకాలను రూపొందించి అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి చెప్పినట్ల సమాచారం. దీనిపై రాహుల్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికే ఆదర్శమని అన్నట్లు తెలిసింది. కులగణన ఫలితాలు త్వరలోనే నిమ్నవర్గాలకు చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచింనట్లు సమాచారం. ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో పేదలకు న్యాయం చేసేలా పథకాలు రూపొందించాలని రాహుల్ గాంధీ ఉపముఖ్యమంత్రికి సూచన చేసినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసీసీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో సుధీర్ఘంగా చర్చించారు.