ప్రజలు ఈవీ వాహనాల కొనుగోలు చేయడానికి ముందుకు రావాలని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఢిల్లీ తరహాలో హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరగకుండా ఉండటానికే ఈవీ పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. జీఓ41 ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ 2026 వరకూ ఉంటుందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల నేతృత్వంలో హైదరాబాదు ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని పొన్నం పేర్కొన్నారు. ఏ రకమైన ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా టాక్స్ లో మినహాయింపు ఇస్తామని పొన్నం ప్రకటించారు. ఎలక్ట్రిక్ బస్సులు కొంటే వంద శాతం టాక్స్ మినహాయింపు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తిరుగుతున్న మూడు వేల బస్సుల స్ధానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని సీయం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి పొన్నం చెప్పారు.