అంతర్గత కలహాలు సృష్టించడానికి మహారాష్ట్రలో బిజెపి పావులు కదుపుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో మోది అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, జార్ఖండ్లో బీజేపీ గెలిస్తే జమిలి ఎన్నికలకు వెళ్లాలని మోదీ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అయితే, జమిలి ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమన్నారు. మహారాష్ట్రలో కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తున్నాని, జార్ఖండ్లో మాత్రం ఒంటరిగా బరిలో ఉన్నామన్నారు. హైదరాబాద్ ముఖ్దుంభవన్లో మీడియాతో నారాయణ మాట్లాడారు. తెలంగాణలో కులగణన అవసరమే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఆర్థిక రాజకీయ సమానత్వం కలిగే రీతిలో కులగణన ఉండాలని సూచించారు. ఈ సర్వేలో 75 ప్రశ్నలు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏం తలపెట్టినా లోపాలు వెతుకుతూ రాజకీయం చేస్తూ కులగణను ముందుకు సాగనివ్వడం లేదన్నారు నారాయణ. కొల్లేరు సరస్సును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.