విజయనగరం జిల్లా మాజీ జాయింట్ కలెక్టర్ జి.క్రైస్ట్ కిషోర్ను సర్వీసు నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖ సిఫార్సు చేసింది. ఆయనపై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జీ క్రైస్ట్ కిషోర్ ను సర్వీసు నుంచి తొలగించాల్సిందిగా సిఫార్సు చేసింది. విజయనగరం జిల్లాలో భూ అక్రమాలపై అప్పటి గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన క్రైస్ట్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతల భూ ఆక్రమణలకు సహకరించారని ఆయనపై అభియోగాలు మోపిన రెవెన్యూ శాఖ.. విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాటి రేగ, కొత్తవలస, బొబ్బిలి , జామి , పార్వతీపురం తదితర మండలాల్లో రూ.350 కోట్ల విలువైన భూముల అవకతవకలకు క్రైస్ట్ కిషోర్ సహకరించారని నివేదికలో వెల్లడించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై తీసుకునే చర్యలు ఇతర అధికారులకు గుణపాఠం కావాలని ఆ నివేదికలో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వైసీపీ నేతల చేతులకు గ్లౌజులుగా జీసీ కిషోర్ మారారని అప్పటి కలెక్టర్ పేర్కొనడం కిషోర్ అడ్డగోలు వ్యవహారాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అధికార దుర్వినియోగం చేసి భూ రికార్డుల సెక్షన్లో దస్త్రాలు కూడా లేకుండా చేశారని కిషోర్పై అభియోగం నమోదయ్యింది. అయితే, విచారణ నివేదిక మేరకు క్రైస్ట్ కిషోర్పై త్వరలోనే సాధారణ పరిపాలన శాఖ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
- Advertisement with us -