కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. మహిళ కళాశాలలో విద్యార్దినిలు ఆందోళనకు దిగారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది. అడ్మిషన్లు చేపట్టింది. కోర్సులు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీగా మార్చాక మొదటి బ్యాచ్ విద్యార్థినుల డిగ్రీ పూర్తి కావస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంపై విద్యార్థినులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక, ఇప్పుడేమో.. కాంగ్రెస్ ప్రబుత్వం వచ్చాక చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. కానీ, యూనివర్సిటీ గుర్తింపు విషయంలో, యూజీసీలో చేర్చే విషయంలో అలసత్వం కొనసాగుతోంది. తమకు సర్టిఫికెట్లు ఏ ప్రతిపదికన ఇస్తారని, ఏ యూనివర్సిటీ పేరుతో ఇస్తారని విద్యార్థినులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారుల నిర్వాకం వల్ల తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని, కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.