తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. వచ్చే మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 21వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 22వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 24వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష, 26వ తేదీన మ్యాథ్స్ పరీక్ష జరుగుతాయి. అలాగే, మార్చి 28వ తేదీన ఫిజిక్స్, 29వ తేదీన బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ రెండో తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి రిజల్ట్స్ అత్యుత్తమంగా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మొదటినుంచే ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. పరీక్షలకు ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో సిలబస్ పూర్తిచేయడం, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధులుగా మార్చడం వంటి అంశాలపై ఇకనుంచి ఫోకస్ పెట్టబోతున్నారు.
ఈ యేడాది విద్యాసంవత్సరం మొదలైనప్పటినుంచే సిలబస్, ఉత్తమ ఫలితాల అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని విద్యాశాఖ అధికారులు చెబుతు్నారు. పకడ్బందీగా పర్యవేక్షించడంతో ఇప్పటికే 95శాతం సిలబస్ పూర్తయ్యిందని చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి సిలబస్ పూర్తవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రిపరేషన్, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.
పరీక్షల షెడ్యూల్ వచ్చినందున
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుకలు రెగ్యులర్ క్లాసులు నిర్వహిస్తూనే.. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక క్లాసులు చెబుతున్నారు. ఇప్పుడు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఇప్పటినుంచీ ప్రతీ వారం స్లిప్ టెస్టులు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇక, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరతి పరీక్షల ఫలితాలకు సంబంధించి పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా విషయాలు బోధించే ఉపాధ్యాయులను సెప్టెంబర్ నాటికే సర్దుబాటు చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిందేనని, ఎక్కడ తేడా కనిపించినా వెంటనే చక్కదిద్దాలని, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేస్తున్నారు.