- కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు
- 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటుచేస్తాం
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సోమవారం శాసనసభా సమావేశంలో సమాధానం ఇచ్చారు. సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సభ్యులకు తెలియజేశారు. రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతోపాటు మ్యాన్యువల్ స్క్రిప్ట్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలో రూ.20కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లల్లో పఠనాసక్తి పెంచే అంశాన్ని సీరియస్ గా తీసుకొని రాబోయే ఆరునెలల్లో మార్పులు తెచ్చేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకోసం కార్టూనిస్టులతో కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం చివరిదశలో ఉందని, ఈ లైబ్రరీని అక్టోబర్ నెలలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల నిర్మాణాలను చేపడతామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త జిల్లాల ప్రాతిపాదికన 26 జిల్లా గ్రంథాలయాలను ఏర్పాటుచేస్తామన్నారు. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులను సంప్రదించి గ్రంధాలయ సెస్సు బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల్లో కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని. ముఖ్యమంత్రి సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.