27.2 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

మిర్చిలో అంతరపంటగా గంజాయి సాగు

ప్రకాశం జిల్లాలో మిర్చి పంటల మాటున గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పుల్లలచెరువు మండలం అయ్యవారిపల్లెలో ఓ వ్యక్తి తన మిరప తోటలో గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడులు చేయగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అదే గ్రామంలో మరో వ్యక్తి వద్ద కూడా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రిపురాంతకం మండలం మేడిపిలో గంజాయి విక్రయిస్తున్న కొందరిని అరెస్ట్ చేసి 1.5 కిలోలకు పైగా గంజాయి, 2 వాహనాలు, ఫోన్లు పట్టుకున్నారు.

మిర్చి పంట పండించే నెపంతో.. ఎవరికీ తెలియకుండా చెట్ల మధ్యలో గంజాయి మొక్కలను కూడా పెంచుతున్నారు. రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు.. ఆ మిర్చి తోటలో గాలింపు చేపట్టి గంజాయి మొక్కలను గుర్తించారు. గంజాయి సాగు విషయం బయటికి రావడంతో పండిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన పోలుబోయిన చిన్న సుబ్బారావు అనే రైతు మిరప తోట పెంచుతున్నాడు.

అందులో ఎవరికీ తెలియకుండా 5 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. గంజాయి సాగు బయటికి రావడానికి మరో ఘటన జరిగింది. అదే అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన ఈపూరి గురవయ్య అనే వ్యక్తి వద్ద 150 గ్రాముల గంజాయి ఉండగా.. స్వయంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారణ జరిపిన ఎక్సైజ్ పోలీసులు.. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేశాడు. పోలుబోయిన చిన్న సుబ్బారావు తన మిరప తోటలో గంజాయి సాగు చేస్తున్నాడని సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మరో ఘటనలో త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న కొందరిని ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వారి వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మలై పోగు సాగర్ బాబు వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని.. మాట చిన్న చంద్రయ్య వద్ద 750 గ్రాముల గంజాయిని.. యుద్దనపూడి హైజాక్ వద్ద నుంచి 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గంజాయి 1.50 కిలోలకు పైగానే ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

గంజాయి దాడుల్లో నిందితులకు చెందిన 2 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్‌లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు, ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గంజాయి దాడుల్లో పాల్గొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వివరించారు. తాజాగా మిర్చి పంటలో గంజాయి సాగు చేస్తున్న నిందితులు దొరకడంతో.. ఎక్సైజ్ శాఖ నిఘా పెంచి.. అన్ని పంటలను తనిఖీలు చేయనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com