24.2 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

అజర్ బైజాన్, టర్కీలకు కట్… వియత్నాంకు పర్యాటకులు

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తుర్కియే పాకిస్తాన్‌కు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేయడం, అజర్‌బైజాన్‌ భారత దాడులను ఖండిస్తూ పాక్‌కు సంఘీభావం తెలపడంతో ఈ రెండు దేశాలపై బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది. హెదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల పర్యాటకులు తమ వేసవి సెలవు ప్రణాళికలను రద్దు చేసుకునే ఉద్యమంలో పాల్గొంటున్నారు. వేసవి సెలవుల సీజన్‌లో తుర్కియే, అజర్‌బైజాన్‌లు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఆకర్షణీయ గమ్యస్థానాలుగా ఉంటాయి. ఈ ఏడాది దాదాపు లక్ష మందికి పైగా పర్యాటకులు ఈ దేశాలను సందర్శించేందుకు ప్రణాళికలు రూపొందించారని అంచనా.

రెండు దేశాలు పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడంతో హైదరాబాద్‌లో కేవలం రెండు మూడు రోజుల్లోనే 10 వేల మందికి పైగా పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకున్నారని వాల్మీకి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వ్యవస్థాపకుడు హరికిషన్‌ వెల్లడించారు. ట్రావెల్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు కొత్త బుకింగ్‌లను నిలిపివేయాలని సూచించింది. టూర్‌ ఆపరేటర్లు ఈ దేశాలకు సంబంధించిన ప్రమోషనల్‌ ఆఫర్‌లను ఉపసంహరించారు.

రద్దుల ఇదే కారణం..
హైదరాబాద్‌: గత వారంలో తుర్కియేకు 22%, అజర్‌బైజాన్‌కు 30% బుకింగ్‌లు రద్దయ్యాయి.

తెలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ తుర్కియే, అజర్‌బైజాన్‌లకు పర్యాటకులను పంపడం పూర్తిగా నిలిపివేసింది. ఏటా ఈ రెండు దేశాలకు 8 వేల మంది పర్యాటకులు వెళ్లేవారని అంచనా.

జాతీయ స్థాయి: మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్‌ వంటి ప్రముఖ ట్రావెల్‌ సంస్థలు తుర్కియే, అజర్‌బైజాన్‌లకు బుకింగ్‌లు 60% తగ్గినట్లు, రద్దులు 250% పెరిగినట్లు నివేదించాయి.

బాయ్‌కాట్‌ ప్రభావం
2024లో దాదాపు 3.3 లక్షల మంది భారతీయులు తుర్కియే, 2.4 లక్షల మంది అజర్‌బైజాన్‌ను సందర్శించారు. రెండు దేశాలకు రూ. 6,900 కోట్లకు పైగా ఆదాయాన్ని అందించారు. ప్రస్తుత బహిష్కరణ ఉద్యమంతో టూరిజం ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత వాణిజ్య సంస్థ CAIT తుర్కియే, అజర్‌బైజాన్‌లతో వాణిజ్య సంబంధాలను రద్దు చేయాలని 24 రాష్ట్రాల నాయకుల సమావేశంలో నిర్ణయించింది. దీంతో ఈ దేశాల ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

తుర్కియే, అజర్‌బైజాన్‌ ప్రతిస్పందన
బహిష్కరణ ఉద్యమం నేపథ్యంలో తుర్కియే టూరిజం శాఖ భారతీయ పర్యాటకుల భద్రత, సంతృప్తికి కట్టుబడి ఉన్నామని, హోటళ్లు, రెస్టారెంట్లు ఎప్పటిలాగే ఆతిథ్యం అందిస్తాయని ప్రకటించింది. అయితే, ఈ హామీలు పర్యాటకుల నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. అజర్‌బైజాన్‌ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రతిస్పందన లేదు, కానీ టూరిజం రంగంలో నష్టం స్పష్టంగా కనిపిస్తోంది.

తుర్కియే, అజర్‌బైజాన్‌ టూర్లను రద్దు చేసుకుంటున్న తెలుగు పర్యాటకులు ప్రత్యామ్నాయంగా ఆసియా దేశాలను ఎంచుకుంటున్నారు. వీటిలో వియత్నాం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇతర గమ్యస్థానాల్లో దుబాయ్, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా ఉన్నాయి. భారత పర్యాటకులకు వీసా ఫ్రీ అవకాశం ఇచ్చేందుకు వియత్నాం ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వియత్నాం బడ్జెట్‌ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, హనోయ్, హా లాంగ్‌ బే, హో చి మిన్‌ సిటీ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com