- రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి
- ఉప రాష్ట్రపతి ఆమోదం… పార్టీకి కూడా రాజీనామా చేస్తా – విజయసాయిరెడ్డి
జగన్మోహనరెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని నాలాంటి వాళ్ళు ఇంకో వెయ్యిమంది వైఎస్సార్సీపీని వీడినా జగన్కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదని వేణుంబాకం విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం ఆయన ఉపరాష్ట్రపతిని కలసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు జగన్మోహన్రెడ్డితో అన్ని విషయాలు చర్చించానని, అయితే ఆయన రాజీనామా చేయవద్దని పార్టీ అండగా ఉంటుందని అన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ పదవికి నేను న్యాయం చెయ్యలేనని చెప్పానని అందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సాయిరెడ్డి చెప్పారు. పార్టీకి కూడా రాజీనామా లేఖ పంపుతానని అన్నారు. నాలుగు దశాబ్ధాలుగా మూడు తరాల పాటు నాకు వైఎస్ కుటుంబంతో ఉన్నానని ఇకమీద కూడా ఎప్పటికీ ఆ కుటుంబంతోనే ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పారు. గతంలోనే నన్ను అప్రూవర్గా మారమని ఒత్తిడి తెచ్చారని కానీ నేను దేనికీ లొంగలేదని, నమ్మక ద్రోహం చేయనని విజయసాయి తెలిపారు. కేవీరావుతో నాకు ఎటువంటి సంబంధం లేదని, విక్రాంత్రెడ్డిని నేను కేవీరావుకు పరిచయం చేశానన్న మాట నిజం కాదని, ఈ విషయంలో కేవీరావు తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పాలని సాయిరెడ్డి సవాల్ విసిరారు. కాకినాడ పోర్ట్ వల్లే నేను రాజీనామా చేసానన్నది నిజంకాదన్నారు. కూటమి ప్రభుత్వం నాపై కేసుపెట్టిందని ఏ కేసులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. నా రాజీనామా వల్ల కూటమి పార్టీలకే లాభమని, తాను ఎలాంటి పదవులు ఆశించి రాజీనామాలు చెయ్యలేదని చెప్పారు. కేసులు మాఫీ చేయించుకోవడానికే రాజీనామా అని కొన్ని మీడియా సంస్ధలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటే బలహీనమవుతా తప్ప కేసులు మాఫీ కావని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తప్పుడు వార్తలు రాయద్దని ఆయన మీడియాను కోరారు. నేను నీతిగా, నిజాయితీగా బతుకుతున్నా, నాకు డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు, హిందూ ధర్మం పాటించే వ్యక్తిగా అబద్దాలు అసలు చెప్పను అని స్పష్టం చేశారు. నేను ఎవరితో విభేధించినా రాజకీయంగా మాత్రమే అని పవన్ కళ్యాణ్తో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉందన్నారు. కేవీరావుపై పరువు నష్టం కేసు వేస్తా అని గతంలో నేను ఎవరిమీదైతే ఛాలెంజ్లు చేశానో వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉంటానని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. నా స్థానంలో నాకన్న విద్యావంతుడ్ని, సమర్ధుడ్ని, రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిని రాజ్యసభకు పంపాలని కోరకుంటున్నట్లు విజయసాయిరెడ్డి మీడియాతో అన్నారు.